Thursday, 26 June 2014

ఇవేం కోతలు?

విద్యుత్ కొరతపై ఏం చేస్తున్నారు?: కేసీఆర్
అధికారులను నిలదీసిన సీఎం
మెరుగుపరచాలని ఆదేశం.. కోతలు లేకుండా చూడాలని సూచన
ఛత్తీస్‌గఢ్ నుంచి అదనపు విద్యుత్ కోసం తీవ్ర యత్నాలు
 
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కొరతను అరికట్టి రాష్ర్టంలో సరఫరాను మెరుగుపరిచేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ‘ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే మీరేం చేస్తున్నారు. విద్యుత్ సరఫరా మెరుగుపరిచేందుకు మీరు తీసుకుంటున్న చర్యలేంటి? ఇప్పటికే వర్షాలు రాకపోవడంతో రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. విద్యుత్ కూడా సరిగా ఇవ్వకుంటే ఇంకా ఇబ్బందులను ఎదుర్కొంటారు. కోతలు లేకుండా చూడండి’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో విద్యుత్ సరఫరా, అదనపు విద్యుత్ కొనుగోలుపై ఇంధనశాఖ అధికారులతో ఆయన గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అదనపు విద్యుత్‌ను పొందేందుకు వీలున్న అన్ని మార్గాలను అన్వేషించాలని.. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతోనూ మాట్లాడాలని సూచించారు. ఛత్తీస్‌గఢ్‌లో అదనపు విద్యుత్ ఉందని, దీన్ని రాష్ట్రానికి తెచ్చేందుకు వీలుగా అవసరమైతే స్వయంగా తానే అక్కడకు వెళ్లి ఆ రాష్ర్ట సీఎం రమణ్‌సింగ్‌తో చర్చిస్తానని కేసీఆర్ పేర్కొన్నారు.

ఛత్తీస్‌గఢ్ నుంచి అదనపు విద్యుత్ పొందే మార్గాలను సూచించాలని ఈ సందర్భంగా అధికారులను కోరారు. దీంతో ఇప్పటికే ఆ రాష్ర్టం నుంచి మహారాష్ట్రలోని వార్ధా వరకు విద్యుత్ సరఫరా లైను ఉందని, వార్ధా నుంచి నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి వరకు కొత్తగా సరఫరా లైను వేస్తే సరిపోతుందని అధికారులు వివరించారు. అయితే వెంటనే ఆ పనులను ప్రారంభించాలని కేసీఆర్ ఆదేశించారు. అలాగే రాష్ట్రానికి అదనపు విద్యుత్ సరఫరా కోసం లైన్లను కేటాయించాలని పవర్‌గ్రిడ్‌ను కోరేందుకు స్వయంగా ఢిల్లీ వెళ్లాలని సీఎస్ రాజీవ్ శర్మను కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు.

వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి వరంగల్ జిల్లాలోని 600 మెగావాట్ల కాకతీయ థర్మల్ పవర్ ప్లాంటు(కేటీపీపీ)లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఈ సందర్భంగా టీజెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి, ట్రాన్స్‌కో సీఎండీ సురేష్ చందా, టీఎస్‌పీడీసీఎల్ సీఎండీ రిజ్వీ తదితరులు పాల్గొన్నారు.
 
‘కేజీ నుంచి పీజీ’ పథకానికి అధ్యయన కమిటీ
‘కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్భంద విద్య’ పథకం విధి విధానాల రూపకల్పన కోసం త్వరలో అధ్యయన కమిటీని నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సచివాలయంలో విద్యా శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి, కార్యదర్శి వికాస్‌రాజ్, కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్ శైలజా రామయ్యర్‌లతో ఆయన పలు అంశాలపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కేజీ నుంచి పీజీ పథకంపై అధ్యయన కమిటీని వేయాలని నిర్ణయించారు.

అయితే ఈ పథకంలో భాగంగా ప్రీ-ప్రైమరీ (ప్రాథమిక స్థాయికన్నా ముందు) సెక్షన్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం.. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల ఆవరణలోకి తెచ్చి ప్రీపైమరీ సెక్షన్లుగా మార్పు చేయాలని యోచిస్తోంది. తద్వారా ఐదేళ్లలోపు పిల్లలకు నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ స్థాయి విద్యను అందించవచ్చని భావిస్తోంది.

కానీ, ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాలు మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నాయి. వాటిలో అంగన్‌వాడీ వర్కర్లు కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్నారు. ఒకవేళ వీటిని ప్రాథమిక పాఠశాలల ఆవరణలోకి తీసుకువస్తే ఆ వర్కర్ల సేవలను ఎలా ఉపయోగించుకోవాలి? వారి సర్వీసు నిబంధనలు ఎలా? వారిని క్రమబద్ధీకరణ చేయాల్సి వస్తే ఎలాంటి నిబంధనలు రూపొందించాలనే అంశాలను ఈ అధ్యయన కమిటీ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.

ఖాళీ అవుతున్న కాంగ్రెస్

హైదరాబాద్, జూన్ 25 (టీ మీడియా): తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమితో పార్టీని వీడేందుకు నేతలు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీలు ఆమోస్, వీ భూపాల్‌రెడ్డి, ఎస్ జగదీశ్వర్‌రెడ్డి, ఎన్ రాజలింగం, టీ భానుప్రసాదరావు టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరితో పాటు ఇప్పటివరకు కాంగ్రెస్‌కు మద్దతుతో గెలిచిన ఉపాధ్యయ ఎమ్మెల్సీలు జానార్దన్‌రెడ్డి, పూల రవీందర్ కూడా గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికల తరువాత ఎమ్మెల్సీ యాదవరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశాలున్నాయి.సాధారణ ఎన్నికలకు ముందు జరిగిన జెడ్పీ ఎన్నికల్లో చాలా చోట్ల కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లకు సమానంగా సీట్లు వచ్చాయి. అలాంటి చోట్ల గెలిచిన జెడ్పీటీసీ సభ్యులు కూడా అధికార పార్టీలోకి చేరుతున్నారు. 

congress
పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుంటున్న టీఆర్‌ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌ను మరింత తీవ్రతరం చేసినట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను పార్టీలోకి రావాలని స్వయంగా ఫోన్లు చేసి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అధిష్టానంపై అసంతప్తి లేనప్పటికీ తెలంగాణ నాయకత్వంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తీరుపై సీనియర్లు మండిపడుతున్నారు. పార్టీ సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు కొంత మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పీసీసీ అధ్యక్షుడిని మార్చాలని కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు కూడా ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. మరోవైపు ఎమ్మెల్సీలు పార్టీకి వీడటంపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం. దీనిపై నివేదిక ఇవ్వాలని పొన్నాలను ఆదేశించినట్టు తెలుస్తోంది.

బియాస్‌లో మరో మృతదేహం లభ్యం


హైదరాబాద్: హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు ఒక్కొక్కటిగా దొరుకుతున్నాయి. నదిలో ఇవాళ మరో మృతదేహం లభ్యమైంది. మతదేహాల కోసం నదిలో గాలిస్తోన్న సిబ్బంది ఇవాళ మరో విద్యార్థి మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ శవాన్ని హైదరాబాద్‌కు చెందిన జగదీశ్ ముదిరాజ్‌గా గుర్తించారు.