ఖాళీ అవుతున్న కాంగ్రెస్
హైదరాబాద్, జూన్ 25 (టీ మీడియా): తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమితో పార్టీని వీడేందుకు నేతలు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీలు ఆమోస్, వీ భూపాల్రెడ్డి, ఎస్ జగదీశ్వర్రెడ్డి, ఎన్ రాజలింగం, టీ భానుప్రసాదరావు టీఆర్ఎస్లో చేరారు. వీరితో పాటు ఇప్పటివరకు కాంగ్రెస్కు మద్దతుతో గెలిచిన ఉపాధ్యయ ఎమ్మెల్సీలు జానార్దన్రెడ్డి, పూల రవీందర్ కూడా గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికల తరువాత ఎమ్మెల్సీ యాదవరెడ్డి టీఆర్ఎస్లో చేరే అవకాశాలున్నాయి.సాధారణ ఎన్నికలకు ముందు జరిగిన జెడ్పీ ఎన్నికల్లో చాలా చోట్ల కాంగ్రెస్, టీఆర్ఎస్లకు సమానంగా సీట్లు వచ్చాయి. అలాంటి చోట్ల గెలిచిన జెడ్పీటీసీ సభ్యులు కూడా అధికార పార్టీలోకి చేరుతున్నారు.

పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుంటున్న టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ను మరింత తీవ్రతరం చేసినట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను పార్టీలోకి రావాలని స్వయంగా ఫోన్లు చేసి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అధిష్టానంపై అసంతప్తి లేనప్పటికీ తెలంగాణ నాయకత్వంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తీరుపై సీనియర్లు మండిపడుతున్నారు. పార్టీ సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు కొంత మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పీసీసీ అధ్యక్షుడిని మార్చాలని కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు కూడా ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. మరోవైపు ఎమ్మెల్సీలు పార్టీకి వీడటంపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్గా ఉన్నట్టు సమాచారం. దీనిపై నివేదిక ఇవ్వాలని పొన్నాలను ఆదేశించినట్టు తెలుస్తోంది.
No comments:
Post a Comment