Wednesday, 25 June 2014

గొడ్డలితో కన్న తండ్రినే చంపిన కొడుకు



కరీంనగర్: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ కన్న కొడుకు తన తండ్రిని గొడ్డలితో దాడి చేసి దారుణంగా చంపేశాడు. పలువురిని విస్మయానికి గురిచేసే ఈ ఘటన జమ్మికుంట మం. పాపక్కపల్లిలో వెలుగుచూసింది.

'ఐఐటి విద్యార్థులకూ ఫీజు రీయింబర్స్‌మెంటు'

హైదరాబాద్:  ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎం తదితర కోర్సులు చేస్తున్న బిసి విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంటు వర్తింపజేయాలని బి.సి.సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన పేద బి.సి. విద్యార్థులు ఈ సౌకర్యం లేక ఫీజు కట్టలేని పరిస్థితుల్లో సీట్లు వదులుకుంటున్నారని అన్నారు. 

జాతీయ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం 2010లోనే సూచించిందని గుర్తుచేశారు.

రూ. 5కే భోజనం, రూ. 3కే టిఫిన్: హరీశ్ రావు(పిక్చర్స్)

హైదరాబాద్: రాష్ట్రంలో మొదటి సారిగా బోయిన్‌పల్లి కూరగాయల మార్కెట్‌లో రూ. 5కే సబ్సీడ్జైడ్ భోజనం, రూ. 3కే టిఫిన్ అందించనున్నట్లు తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి టి హరీశ్ రావు వెల్లడించారు. ఎక్సైజ్ శాఖమంత్రి కత్తి పద్మారావుతో కలిసి మంగళవారం సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి మార్కెట్‌ను సందర్శించి, రైతులు, హమాలీలు, కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బోయిన్‌పల్లి మార్కెట్‌ను బాబాసాహెబ్ అంబేద్కర్ మార్కెట్‌గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశామని, అప్పుడే ఈ మార్కెట్‌ను సందర్శిస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పినట్లు తెలిపారు. అందుకే ఇక్కడికి వచ్చి సమస్యలు తెలుసుకుంటున్నామని చెప్పారు. ముఖ్యంగా క్యాంటీన్ ద్వారా సరఫరా చేస్తున్న పలహారాలు, భోజనం ఎక్కువ రేటుకు విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. రైతులకు, హమాలీలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో రూ. 5కే భోజనం, రూ. 3కే అల్పాహారాన్ని అందించాలని నిశ్చయించినట్లు తెలిపారు. ఈ పథకం అమలుకు అవసరమైన కార్యాచరణను వారంలోగా రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఈ పథకం సత్ఫలితాలను సాధిస్తే ఇతర మార్కెట్లలో కూడా పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. చెన్నైలో అమలవుతున్న సబ్సిడీ భోజన పథకాన్ని అధ్యయనం చేసేందుకు అధికారుల బృందం వెళ్లనున్నదని, అదేవిధంగా ఇప్పటికే ఈ పథకాన్ని అమలు చేస్తున్న జిహెచ్ఎంసి, హారే రామా సంస్థలతో కూడా అధికారులు చర్చిస్తారని అన్నారు. సబ్సిడీ భోజనమే కాకుండా మార్కెట్ యార్డులో తాగునీరు, మరుగుదొడ్లు తదితర వసతులను కల్పిస్తామని చెప్పారు. రైతుల కోసం అన్ని వసతులు కలిగిన విశ్రాంతి గదులను నిర్మిస్తామని హరీశ్ రావు చెప్పారు. ఉల్లి గడ్డల ధరలను నియంత్రించడానికి వీలుగా 9 రైతు బజార్లు, 11 మన కూరగాయల కేంద్రాల్లో రూ. 18కే కిలో ఉల్లిగడ్డలు విక్రయించేందుకు ఏర్పాటు చేశామని చెప్పారు. ఉల్లి సాగును ప్రొత్సహించే చర్యలు చేపడతామని అన్నారు. మహారాష్ట్ర రైతులు అవలంభిస్తున్న ప్రక్రియలపై అధ్యయనం చేసేందుకు వీలుగా అధికారుల బృందాన్ని పంపిస్తున్నామని చెప్పారు. తమది రైతు ప్రభుత్వమని, అన్ని వసతులు కల్పించి తద్వారా వారి ఆదాయాన్ని పెంచడానికి తగు చర్యలు తీసుంటామన్నారు. ఇప్పటికే 18వేల కోట్లకు పైగా రైతు రుణాలను మాఫీ చేశామని చెప్పారు. దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో వెజిటేబుల్ హబ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను తయారు చేసేందుకు హార్టీకల్చర్ మార్కెటింగ్ శాఖ అధికారులకు తగు ఆదేశాలిచ్చామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, కమిషన్ జనార్ధన్ రెడ్డి, అదనపు కమిషనర్ లక్ష్మీబాయి, మార్కెట్ కమిటీ డిప్యూటీ డైరెక్టర్ పద్మహర్షా, స్థానిక డిప్యూటీ ఇంజినీర్ తదితరలు పాల్గొన్నారు. రూ. 5కే భోజనం: హరీశ్ 1/11 మార్కెట్ వద్ద.. రాష్ట్రంలో మొదటి సారిగా బోయిన్‌పల్లి కూరగాయల మార్కెట్‌లో రూ. 5కే సబ్సీడ్జైడ్ భోజనం, రూ. 3కే టిఫిన్ అందించనున్నట్లు తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి టి హరీశ్ రావు వెల్లడించారు.

తెలంగాణ రాజకీయ నాయకత్వం ఏకంకావాలి: సీఎం

హైదరాబాద్: వచ్చిన తెలంగాణ బాగు పడాలంటే తెలంగాణ రాజకీయ నాయకత్వం ఏకం కావాల్సిన అవసరం ఉందని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రయోజనాలకు గండికొట్టే సీమాంధ్ర పార్టీలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను అడ్డుకుంటున్న టీడీపీలో తెలంగాణ టీడీపీ నేతలు ఇంకా ఎలా కొనసాగుతారో ఆలోచించుకోవాలని సూచించారు. ఎవరైతే టీఆర్‌ఎస్ గల్లంతవుతుందని వ్యాఖ్యలు చేశారో వాళ్లే ఇవాళ కొట్టుకుపోయారని వ్యాఖ్యానించారు.

9 మంది ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో చేరిక

Updated: June 25, 2014 17:04 (IST)
హైదరాబాద్: తొమ్మిది మంది ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో చేరారు.  కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఆమోస్‌, రాజలింగం,  భానుప్రసాద్, జగదీశ్వర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, సలీం, పిఆర్ టియు ఎమ్మెల్సీలు పూల రవీందర్, జనార్ధన్‌ రెడ్డి,  బిఎస్పీ ఎమ్మెల్యేలు ఇంద్రకరణ్‌ రెడ్డి, కోనేరు కోనప్పలు టిఆర్ఎస్ కార్యాలయానికి వచ్చి ఆ పార్టీ లో చేరారు. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భానుప్రసాద్ ప్రసాద్ మాట్లాడుతూ సోనియా గాంధీపై కోపంతో తాము టిఆర్ఎస్ లో చేరడంలేదని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు కోసం సోనియా ఎంతో కృషి చేశారని అన్నారు.  తెలంగాణ అభివృద్ధి కోసమే తాము టిఆర్ఎస్ లో చేరినట్లు చెప్పారు.

రాంచరణ్ నివాసంలోకి దూరిన విష సర్పం!

  | Updated: June 25, 2014 17:12 (IST)
రాంచరణ్ నివాసంలోకి దూరిన విష సర్పం!
టాలీవుడ్ నటుడు రాంచరణ్ నివాసంలో అనుకోని అతిధి ప్రత్యక్ష మయ్యాడు. రాంచరణ్ నివాసానికి వచ్చింది మిత్రుడో.. పరిచయమున్న వ్యక్తో అయితే అంత ఇబ్బందేమి ఉండేది కాదు. కాని ఆయన ఇంట్లోకి వచ్చింది  ఓ విష సర్పం.
ఇంట్లోకి పాము దూరిన సంఘటన రాంచరణ్ సిబ్బందికి కొద్దిసేపు ఆందోళన కలిగించింది. అయితే ఆ పామును చంపకుండా వదిలివేయడంపై పలువురు జంతు ప్రేమికులకు ఆనందం కలిగించింది. తన నివాసంలోకి పాము దూరిందని రాంచరణ్ ఫేస్ బుక్ లో ఓ ఫోటోను పోస్ట్ చేశారు. 
గత రాత్రి ఇంట్లోకి పాము దూరిందని గ్రహించిన రాంచరణ్ సిబ్బంది... పారిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆతర్వాత జాగ్రత్తగా ఒడిసిపట్టుకుని.. జంతు సంరక్షణ సొసైటీకి కబురు పెట్టి.. వాళ్లకు అప్పగించారు. సోసైటీకి చెందిన సిబ్బంది పామును అడవిలో వదిలివేసినట్టు తెలిసింది.